Rss Feed

"సిరివెన్నెల" గారి" అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా"?

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా? ఆత్మవినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా? చిన్నప్పుడు పాటలు వినే కొత్తలో శ్రీశ్రీ రచించిన పాడవోయి భారతీయుడా అనే పాట చాలా గొప్పపాట అని అమ్మ వినిపించేది. పాట వచ్చి ముప్పయ్యేళ్ళు గడిచినా చూడు ఇప్పటికీ ఆ పాట ఎంత రెలవెంటుగా ఉందో అని చెప్పేది. అప్పటిలో శ్రీశ్రీ దార్శనికత మీద గొప్ప అభిమానం పెంచేసుకున్నా కూడాను. కొన్నాళ్ళ తర్వాత అర్థమయ్యింది – రాయడంలో శ్రీశ్రీ గొప్పతనం ఎంతలా ఉన్నా – ఆ పాటని నిజం చెయ్యడంలో సమాజం “గొప్పతనాన్ని” కూడా తక్కువ అంచనా వేయకూడదని. సిందూరం అనే సినిమాలో వ్రాయబడ్డ ఈ పాటగురించి కూడా పై అభిప్రాయం వర్తిస్తుందనుకుంటాను. ఈ పాట పదేళ్ళక్రితం యాభయ్యవ స్వాతంత్ర సంబరాల సమయంలో అనుకుంటా వ్రాయబడింది. నిన్నే ఎందుకో హమ్ముకుంటుంటే – ఆహా! అయితే మనం గత పదేళ్ళలో పెద్దగా ఒరగబెట్టేసినదేమీ లేదన్నమాట అనిపించింది. పాట వింటూ అనిపించిన కొన్ని అనుభూతుల్ని మీతో పంచుకుందామని… శాంతికపోతపు కుత్తుక తెంచి తెచ్చినబహుమానం – ఈ రక్తపు సింధూరం నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా – ఓ పవిత్ర భారతమా! అవ్వడానికి సింధూరమే – పవిత్రమే – తెచ్చినదే ఎక్కడనుండి – కపోతాన్ని – అదే శాంతికపోతపు రక్తంతో భరతమాతకి సింధూరం దిద్దుతున్న సమాజం గత యాభయ్యేళ్ళలో అస్సలు మారలేదు. నాటి దేశవిభజన గొడవలనుండి – నేటి ఒరిస్సా మారణహోమాల దాకా – ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం – కృష్ణగీత ఆపిందా నిత్యకురుక్షేత్రం – మారదు లోకం – మారదు లోకం. కులాలకోసం గుంపులు కడుతూ మతాలకోసం మంటలు పెడుతూ ఎక్కడలేని తెగువను చూపి తగువుకు లేస్తారే – జనాలు తలలర్పిస్తారే సమూహక్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరేం- తెలిసీ భుజంకలిపి రారేం అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి – పోరి ఏవిటి సాధించాలి ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం – ఈ చిచ్చుల సింధూరం జవాబు చెప్పే బాధ్యత మరిచిన జనాల భారతమా – ఓ అనాధ భారతమా! ఒకవంక కులాల కురుక్షేత్రం. మరొకవంక మతాల మారణహోమం. పోనీ ఇవన్నీ అలా జరిగిపోతున్నాయా – కాదే - జరిపింపబడుతున్నాయి. ఎందుకు అని తెలిసినవాళ్ళంతా బానే ఉన్నారు. తెలియని మూర్ఖజనాలు బలవుతున్నారు. ఆపగలిగిన మేధావివర్గం దేశం అనే భావనే టెర్రరిజానికి మూలం – కాబట్టి దేశభక్తన్న భావనే పోవాలి అంటుంది. స్వేఛ్చ దేనికయ్యా అంటే కొట్టుకోవడానికి – ఎవరు ఎవరికోసం ఎవరితో కొట్టుకుంటున్నారు – ఎందుకోసం కొట్టుకుంటున్నారు – నూరుకోట్లమంది నీ నీడలో, నీ తిండి తింటూ, ఆనందంగా కొట్టుకుంటూ స్వేఛ్చని అనుభవిస్తున్నారు. నువ్వుమాత్రం అనాధవే… అమ్మ తుఝే సలాం. అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం క్రూరమృగంలా కారడువుల్లో దాక్కుని ఉండాలా – వెలుగుని తప్పుకు తిరగాలా శత్రువుతో పోరాడే సైన్యం – శాంతిని కాపాడే కర్తవ్యం స్వజాతివీరులనణిచే విధిలో కవాతు చెయ్యాలా – అన్నలచేతిలో చావాలా తనలో ధైర్యం అడవికి ఇచ్చి – తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ సమరం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం చీకటివైపా వేకువలోకా ఎటు నడిపేనమ్మా – గతి తోచని భారతమా ధైర్యమూ, ధర్మమూ రెండూ సమాజంలో ఉంటే ఆ సమాజంలో శాంతి వెల్లివిరుస్తుంది. ఆ రెంటినీ సమాజం పంచేసింది. ఒకభాగం అడవిలో నక్సలైట్లకిచ్చి, మరోభాగం పోలీసులకిచ్చి ఆ కలహాన్ని చూస్తూ సంఘం శిలలా చూస్తూ ఉంటే… సమాజంలో జీవం ఎక్కడుంది? అలాంటి జీవంలేని శవాల్లా సమాజంలో నడుస్తున్న మేధోజనాలం మనం. మన సిగలో నెత్తుటి మందారాన్ని తురుముతున్న ఈ సింధూరసంధ్య ఎటు తీసుకుపోతుందో? ఈ సంధ్య ఉదయసంధ్యో, సాయంసంధ్యో అర్థం కావడం లేదు. మనందరికీ ఒకటే తృప్తి. సాయం సంధ్య అయినా రాత్రంతా గడిచైనా రేపుదయం వస్తుందని. మనకేమన్నా తొందరా? మనం నడిచి వెళ్ళాలంటే సమస్య – మనం నడవనంతవరకూ ఎవరెక్కడికి పట్టుకెళ్ళినా మనకి పరవాలేదు. వీలైతే స్పందించడమే మానేద్దాం. లేదంటే నక్సలైట్లదే తప్పని కాస్త అరుద్దాం. కాదంటే పోలీసులదే తప్పని గోలచేద్దాం. లేదంటే హిందూమతానిదే పాపం అని ప్రశ్నిద్దాం. పోదంటే ముస్లిములే తీవ్రవాదులని నిర్ణయిద్దాం. మరింత ఆజ్యాన్ని రగిలిద్దాం. ఆ చితిమంటల వెలుగులో మనం చలికాచుకుందాం. అంతేనా… తనతలరాతను తనే మార్చగల అవకాశాన్నే వదలుకొని తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని ప్రజాస్వామ్యమని పిలిచే జాతిని ప్రశ్నించడమే మానుకుని కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం చితిమంటల సింధూరం చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాలభారతమా ఓ విషాద భారతమా! అస్సలు ఈ పాటకి మీకు మధ్య నేనుండాలా అనిపిస్తుంది. కళ్ళున్న జాతిని కళ్ళు తెరవమని చెప్పడానికి అటు ఆవేశానికీ, ఇటు అధికారానికీ తీరుబడిలేదు గానీ, నడిపించడానికి మాత్రం వాళ్ళల్లో వాళ్ళు కొట్టేసుకుంటున్నారు. ఈ కురుక్షేత్రానికి అతిముఖ్యలోపం గమ్యం లేకపోవడం – గమ్యం తెలియకపోవడం. ఈ చితిమంటల సింధూరం చూస్తూ కూడా నిదురిస్తావా అని భారతానికొక ప్రశ్న. భారతమంటే నేను కాదు అని అనేసుకుని పక్కకు వెళ్ళిపోకండేం!