Rss Feed

"సిరివెన్నెల" గారి" అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా"?

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా? ఆత్మవినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా? చిన్నప్పుడు పాటలు వినే కొత్తలో శ్రీశ్రీ రచించిన పాడవోయి భారతీయుడా అనే పాట చాలా గొప్పపాట అని అమ్మ వినిపించేది. పాట వచ్చి ముప్పయ్యేళ్ళు గడిచినా చూడు ఇప్పటికీ ఆ పాట ఎంత రెలవెంటుగా ఉందో అని చెప్పేది. అప్పటిలో శ్రీశ్రీ దార్శనికత మీద గొప్ప అభిమానం పెంచేసుకున్నా కూడాను. కొన్నాళ్ళ తర్వాత అర్థమయ్యింది – రాయడంలో శ్రీశ్రీ గొప్పతనం ఎంతలా ఉన్నా – ఆ పాటని నిజం చెయ్యడంలో సమాజం “గొప్పతనాన్ని” కూడా తక్కువ అంచనా వేయకూడదని. సిందూరం అనే సినిమాలో వ్రాయబడ్డ ఈ పాటగురించి కూడా పై అభిప్రాయం వర్తిస్తుందనుకుంటాను. ఈ పాట పదేళ్ళక్రితం యాభయ్యవ స్వాతంత్ర సంబరాల సమయంలో అనుకుంటా వ్రాయబడింది. నిన్నే ఎందుకో హమ్ముకుంటుంటే – ఆహా! అయితే మనం గత పదేళ్ళలో పెద్దగా ఒరగబెట్టేసినదేమీ లేదన్నమాట అనిపించింది. పాట వింటూ అనిపించిన కొన్ని అనుభూతుల్ని మీతో పంచుకుందామని… శాంతికపోతపు కుత్తుక తెంచి తెచ్చినబహుమానం – ఈ రక్తపు సింధూరం నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా – ఓ పవిత్ర భారతమా! అవ్వడానికి సింధూరమే – పవిత్రమే – తెచ్చినదే ఎక్కడనుండి – కపోతాన్ని – అదే శాంతికపోతపు రక్తంతో భరతమాతకి సింధూరం దిద్దుతున్న సమాజం గత యాభయ్యేళ్ళలో అస్సలు మారలేదు. నాటి దేశవిభజన గొడవలనుండి – నేటి ఒరిస్సా మారణహోమాల దాకా – ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం – కృష్ణగీత ఆపిందా నిత్యకురుక్షేత్రం – మారదు లోకం – మారదు లోకం. కులాలకోసం గుంపులు కడుతూ మతాలకోసం మంటలు పెడుతూ ఎక్కడలేని తెగువను చూపి తగువుకు లేస్తారే – జనాలు తలలర్పిస్తారే సమూహక్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరేం- తెలిసీ భుజంకలిపి రారేం అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి – పోరి ఏవిటి సాధించాలి ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం – ఈ చిచ్చుల సింధూరం జవాబు చెప్పే బాధ్యత మరిచిన జనాల భారతమా – ఓ అనాధ భారతమా! ఒకవంక కులాల కురుక్షేత్రం. మరొకవంక మతాల మారణహోమం. పోనీ ఇవన్నీ అలా జరిగిపోతున్నాయా – కాదే - జరిపింపబడుతున్నాయి. ఎందుకు అని తెలిసినవాళ్ళంతా బానే ఉన్నారు. తెలియని మూర్ఖజనాలు బలవుతున్నారు. ఆపగలిగిన మేధావివర్గం దేశం అనే భావనే టెర్రరిజానికి మూలం – కాబట్టి దేశభక్తన్న భావనే పోవాలి అంటుంది. స్వేఛ్చ దేనికయ్యా అంటే కొట్టుకోవడానికి – ఎవరు ఎవరికోసం ఎవరితో కొట్టుకుంటున్నారు – ఎందుకోసం కొట్టుకుంటున్నారు – నూరుకోట్లమంది నీ నీడలో, నీ తిండి తింటూ, ఆనందంగా కొట్టుకుంటూ స్వేఛ్చని అనుభవిస్తున్నారు. నువ్వుమాత్రం అనాధవే… అమ్మ తుఝే సలాం. అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం క్రూరమృగంలా కారడువుల్లో దాక్కుని ఉండాలా – వెలుగుని తప్పుకు తిరగాలా శత్రువుతో పోరాడే సైన్యం – శాంతిని కాపాడే కర్తవ్యం స్వజాతివీరులనణిచే విధిలో కవాతు చెయ్యాలా – అన్నలచేతిలో చావాలా తనలో ధైర్యం అడవికి ఇచ్చి – తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ సమరం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం చీకటివైపా వేకువలోకా ఎటు నడిపేనమ్మా – గతి తోచని భారతమా ధైర్యమూ, ధర్మమూ రెండూ సమాజంలో ఉంటే ఆ సమాజంలో శాంతి వెల్లివిరుస్తుంది. ఆ రెంటినీ సమాజం పంచేసింది. ఒకభాగం అడవిలో నక్సలైట్లకిచ్చి, మరోభాగం పోలీసులకిచ్చి ఆ కలహాన్ని చూస్తూ సంఘం శిలలా చూస్తూ ఉంటే… సమాజంలో జీవం ఎక్కడుంది? అలాంటి జీవంలేని శవాల్లా సమాజంలో నడుస్తున్న మేధోజనాలం మనం. మన సిగలో నెత్తుటి మందారాన్ని తురుముతున్న ఈ సింధూరసంధ్య ఎటు తీసుకుపోతుందో? ఈ సంధ్య ఉదయసంధ్యో, సాయంసంధ్యో అర్థం కావడం లేదు. మనందరికీ ఒకటే తృప్తి. సాయం సంధ్య అయినా రాత్రంతా గడిచైనా రేపుదయం వస్తుందని. మనకేమన్నా తొందరా? మనం నడిచి వెళ్ళాలంటే సమస్య – మనం నడవనంతవరకూ ఎవరెక్కడికి పట్టుకెళ్ళినా మనకి పరవాలేదు. వీలైతే స్పందించడమే మానేద్దాం. లేదంటే నక్సలైట్లదే తప్పని కాస్త అరుద్దాం. కాదంటే పోలీసులదే తప్పని గోలచేద్దాం. లేదంటే హిందూమతానిదే పాపం అని ప్రశ్నిద్దాం. పోదంటే ముస్లిములే తీవ్రవాదులని నిర్ణయిద్దాం. మరింత ఆజ్యాన్ని రగిలిద్దాం. ఆ చితిమంటల వెలుగులో మనం చలికాచుకుందాం. అంతేనా… తనతలరాతను తనే మార్చగల అవకాశాన్నే వదలుకొని తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని ప్రజాస్వామ్యమని పిలిచే జాతిని ప్రశ్నించడమే మానుకుని కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం చితిమంటల సింధూరం చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాలభారతమా ఓ విషాద భారతమా! అస్సలు ఈ పాటకి మీకు మధ్య నేనుండాలా అనిపిస్తుంది. కళ్ళున్న జాతిని కళ్ళు తెరవమని చెప్పడానికి అటు ఆవేశానికీ, ఇటు అధికారానికీ తీరుబడిలేదు గానీ, నడిపించడానికి మాత్రం వాళ్ళల్లో వాళ్ళు కొట్టేసుకుంటున్నారు. ఈ కురుక్షేత్రానికి అతిముఖ్యలోపం గమ్యం లేకపోవడం – గమ్యం తెలియకపోవడం. ఈ చితిమంటల సింధూరం చూస్తూ కూడా నిదురిస్తావా అని భారతానికొక ప్రశ్న. భారతమంటే నేను కాదు అని అనేసుకుని పక్కకు వెళ్ళిపోకండేం!

కాసేపు మణిరత్నం గారి గురించి ..

మణి రత్నం మొదటి నాలుగు సినిమాలు నేను చూళ్ళేదు (పల్లవి అనుపల్లవి , ఉన్నారు , పాగల్ నిలవు , ఇదయ కోవిల్ ) కాబట్టి వాటి మీద నో కామెంట్స్ . మౌన రాగం --- చాలా డీసెంట్ సినిమా , ఇలాంటి సినిమాలు తెలుగు లో కూడా అప్పటికీ చాలా వచ్చినా , స్క్రీన్ ప్లే పరంగా .. ఇది కాస్త ఎడ్జ్ ఓవర్ విన్నర్ .. అప్పట్లో వచ్చిన మరో తమిళ సినిమా కు ఇది కొంత కాపీ అని విన్నాను , దీని తరువాత ఆయన చాలా సినిమాలు ఇతరుల సినిమాలనుంచి inspire అయినవే , కొంత వరకూ కాపీ కూడా అనొచ్చు !! నన్ను అడిగితే అదే అంటాను !! రేవతి గారి ఆక్టింగ్ ఇందులో నిజంగా సూపర్ !! shez one of my fav actors in indina cinema. నాయకన్ --- ఎవరెన్ని చెప్పినా .. నేను మాత్రం ఇది కచ్చితంగా గాడ్ ఫాధర్ కాపీ అనే అంటాను, అందులో ఒక ఇటాలియన్ అమెరికా లో మాఫియా డాన్ గా ఎదిగితే .. ఇందులో ఒక మదరాసి .. బాంబే లో డాన్ గా ఎదుగుతాడు , ఇక ఇందులో సీన్లు చాలా వరకు మక్కీ కి మక్కీ దించక పోయినా ...స్క్రీన్ ప్లే ... టేకింగ్ ... ఇలా చాలా వరకు కాపీ యే ... కాపీ అయినా ఇండియన్ నేటివిటీ కి ఈ సబ్జెక్ట్ ఆపాదించి తీసి హిట్ చెయ్యడం గొప్ప కాదా అనవచ్చు .... కచ్చితంగా కాదు ... గాడ్ ఫాథర్ లాంటి సబ్జెక్ట్ , విభిన్న జాతూల తో ఒక మిని ప్రపంచం గా అలలారుతున్న మన భారతదేశానికి అతికినట్టు సరిపోతుంది .. కాబట్టి అందులో గొప్ప దనేమీ లేదు ... ఆ మాటకొస్తే మణి రత్నం కంటే రాం గోపాల్ వర్మా నే కొంత వరకూ బెటరూ ... ఆయన కనీసం సర్కార్ , నన్ను inspire చేసిన గాడ్ ఫాథర్ కి ఫ్రాంసిస్ ఫోర్డ్ కొప్పోలా కి నేను అర్పిస్తున్న గురు దక్షిణ అని ప్రకటించుకున్నారు ... మణి మాత్రం అది కాపీ కానే కాదు అని మంకు పట్టు పడుతున్నాడు . పైగా నాయకన్ TIME ప్రకటించిన 100 గ్రేటెస్ట్ ఫిలంస్ ఎవర్ మేడ్ లిస్ట్ లో ... ఉంది ఘర్షణ / అగ్ని నక్షత్రం ----- అసలు ఈ సినిమా ఎందుకు తీసాడో మణి రత్నానికే తెలియాలి , నన్ను అడిగితే ... ఇందులో హాస్పిటల్ సీన్ లో ప్రభు , కార్తీక్ వాళ్ళ నాన్న ని రూం మార్చి , మెట్ల దగ్గర కాపు కాసే సీన్ .. గాడ్ ఫాథర్ నుంచి మక్కి కి మక్కి దించేసారు మణి 'రతనం' గారు ..... అంజలి ---- ఈ సినిమా కు ఒక ఇంగ్లీష్ నవల ఆధారం , కొన్ని సీన్లు స్పీల్ బర్గ్ E.T నుంచి inspire అయ్యాయి , ఇందులో చిన్నారి షామిలీ అక్టింగ్ నిజంగా సూపర్ , రేవతి సినిమా కి మరో అసెట్. దళ పతి ---- ఈ సినిమా లో ని రజనీ , మమ్ముటి , అరవింద్ స్వామీ పాత్రలు మహా భారతం లో కర్ణుడు , ధుర్యోధనుడు , అర్జునుడి పాత్రలను తలపిస్తాయి , కధ కూడా కొంత వరకూ అలానే ఉంటుంది , ఇందులో మమ్ముటి పాత్ర మధ్యలో వీక్ అయినట్టు అనిపిస్తుంది , కొంత సైకోటెరిక్ గా కూడా అనిపిస్తుంది . దీని పై 1960's లో వచ్చిన హాలీవుడ్ గాంగ్ స్టా సినిమాల ప్రభావం చాలా వరకూ ఉందనిపిస్తుంది . గీతంజలి ---- ఒప్పుకుంటా ... ఈ సినిమా నిఝాంగా చాలా బావుంటుంది ... పైగా ఇందులో నాగార్జునా ఉన్నాడు అందుకే నో కామెంట్స్ . ;) రోజా --- దళ పతి మహా భారతం నుంచి inspire అయినట్టే ఇది మైధలాజికల్ కారెక్టర్ సావిత్రి కధ నుంచి inspire అయ్యింది , కాక పోతే అక్కడ యముడు , ఇక్కడ టెర్రరిస్టు , అందులో సావిత్రి పట్టు దల చూసి యముడు కరిగి పోతే ... ఇక్కడ అరవింద్ స్వామి మాటలకి టెర్రరిస్టు ice అయి పోయాడు ... కానీ ఇందులో జెండా తగుల బెట్టే సీన్ చూస్తే మాత్రం ... రక్తం ఉడికి పోతుంది . దొంగా దొంగా --- రాం గోపాల్ వర్మా , మణి రత్నం కలిసి ఒక సినిమా నిర్మిస్తున్నరంటే ... అది ఏ రేంజి లో ఉందో అనుకుంటాం , నిజం చెప్పాలంటే అప్పట్లో ఈ సినిమా సూపర్ గ ఉంది అనిపించింది , కానీ ఇప్పుడు చూస్తే ... బాంబే ---- హమ్ ..మ్.....మ్..మ్ ఈ సినిమా కి ఏం వంకలు పెట్టొచ్చబ్బా ?? ;) , రియల్ ఇంసిడెంట్ నుంచి inspire అయ్యింది ... పైగా చాలా మంచి వర్క్ ... కాబట్టి నో కామెంట్స్ . ఇద్దరు --- తమిళ నాడు రాజకీయల ఆధారంగా తీసిన సినిమా ఇది !! పర్లేదు బానే ఉంటుంది !! చాలా చోట్ల కధ మరీ పర్సనలైజ్ చేసినట్టు అనిపించింది , కధనం కూడా స్లో .... ముఖ్య పాత్రల మధ్య వైరం కూడా సినిమాలో వేగం తేలేక పోయింది !! దిల్ సే --- చూళ్ళేదు , నో కామెంట్స్ !! :) సఖి --- పర్లేదు మంచి సినిమా ... కాక పోతే .. ఇలాంటి వి బోల్డొచ్చాయి కాబట్టి లైట్ .. :) అమ్రుతా --- తమిళ టైగర్ల పోరాట నేపధ్యం లో సాగుతుంది ... మొదటి అర్ధ గంట తరువాత సినిమాలో వేగం పెరిగింది కానీ , ప్లాట్ లో ని కాంప్లెక్సిటీ సరిగ్గా హండిల్ చెయ్య క పోవడం వల్ల నేమో మధ్యలో డైల్యూట్ అయినట్టు అనిపించింది !! కానీ ఇందులో మాధవన్ , సిమ్రాన్ పాత్రలు చాలా బాగున్నాయి , సిమ్రాన్ ఒక తల్లి గా తన అమ్రుతకు సహాయ పడుతుంటే .... మాధవన్ మాత్రం తన రీసెర్చి కి కూడా పనికివస్తుంది అన్న రీతిలో ఉంటాడు , ఒక డెడికేటెడ్ రచయిత , తన లోని తండ్రి పాత్రను అధిగమించి అమ్రుత కు సహాయ పడుతుంది !! యువ --- ఈ సినిమా లో హీరోల ఇంట్రడక్షన్ సీన్ చూసి అందరూ ... మాకి కిరి కిరి ఏం తీసాడు మావా అన్నారు .. తీరా చూస్తే మెక్సికన్ సినిమా అమెరోస్ పెరురోస్ నుంచి కాపీ పేస్ట్ చేసారు ... సరే ఆ సీన్ వదిలేసి సినిమా అన్నా గొప్పగా ఉందా అంటే అదీ లేదు .... పాలిట్రిక్స్ లో యువత అనే మంచి కాచీ సబ్జెక్ట్ తీసుకొని ఊదేసారు , సినిమా లో బేసిక్ ఎలిమెంట్స్ చాలా మిస్స్ అయినట్టు అనిపించాయి . గురు --- Orson Welles తీసిన సిటిజన్ కేన్ చూసొచ్చి ఈ సినిమా చూడండి , కధా కధనాలు వేరైనా ... కారెక్టర్ పరంగా ... విజువల్స్ పరంగా .. స్క్రీన్ ప్లే పరంగా ఎన్ని సారూప్యతలు ఉన్నాయో మీరే గడ గడా చెబుతారు , ఇక అభిషేక్ అయితే Orson లాగా ఆక్ట్ చేడానికి తెగ కష్టపడ్డాడు పాపం , ఇందులో లైటింగ్ టెక్నిక్స్ అంతకు ముందే వచ్చిన స్పీల్ బర్గ్ సినిమా మ్యూనిక్ లైటింగ్ ఎఫెక్ట్స్ ని గుర్తుకు తెస్తాయి . దీన్ని ధీరూ భాయి అంబానీ జీవితం ఆధారంగా తీసారు. ఎందుకో నాకు పెద్దగా నచ్చలేదు !! ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా ఈ సం వ మన దేశం తరుఫున ఆస్కార్ కి పంపిస్తారట , చూద్దాం ఏ చేస్తాడో మన గురూ గారు !! Creative Commons License
suman by morning shot is licensed under a Creative Commons Attribution 2.5 India License.
Based on a work at writtenbysuman.blogspot.com.
Permissions beyond the scope of this license may be available at http://writtenbysuman.blogspot.com/.

RADIO

‘కొత్త బంగారులోకం’ మరీ అంత కొత్తగా ఎమీ లేదు

సినిమా కథ గురించి చెప్పేందుకు అంత ఏమీ లేదు కానీ కథనం మాత్రం కొన్ని చోట్ల బాగుంది. కథ: ఒకమ్మాయీ ఒకబ్బాయీ ప్రేమించుకుంటారు. చివరికి వాళ్లు కలవటం. మరి మధ్యలో కలవరా అంటే సినిమాలో చాలా సేపు కలిసే ఉంటారు కానీ అసలు కలవటం అన్నమాట. కాలేజిలో కలవటం, ప్రేమించుకోటం , పెద్దలకి దొరికి పోటం. షరా మామూలే. దాన్ని కొంచం బ్రతికించింది నటీ నటుల ప్రతిభ. కథనమేలా సాగిందంటే…: జయసుధ నేరేషన్లో కథ నడుస్తుంది. మంచి నటి కావటం, వాయిస్ బాగుండటం వల్ల నేరేషన్ లో ఏమీ భయం వెయ్యదు చూసేవాళ్ళకి. కానీ నాకు మాత్రం భయం వేసింది. (కృష్ణంరాజు, జయసుధలని పెట్టి మన్మధుడు తీసినా నేను ఇండియాలో A రేటింగూ, అమెరికాలో R రేటింగూ ఇస్తాను. గతానుభవం మరి). ఐతే అంత భయపడే విషయం ఏదీ లేదులే. నటీ నటులు: వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్, ప్రకాశ్రాజ్, జయసుధ, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రావు రమేష్. ప్రతిభ: హీరో మనకి ‘హ్యాపీడేస్’ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. హీరోయిన్ కొత్తమ్మాయి లానే ఉంది. పాపం వాళ్ళకి దర్శకుడు నటించే అవకాశం ఇవ్వలేదు. దాంతో వాళ్ళిద్దరూ బ్రతికి పోయారు. అంతా వాళ్ల వయసుకు తగ్గట్టుగానే ఉండటంతో పెద్ద కష్ట పడకుండానే లాగించేశారు. మెచ్చుకోవచ్చు. హీరోయిన్ క్యూట్ గా ఉంది. ఈమధ్య అంత పెద్ద జడ ఉన్నా అమ్మాయిని చూడలేదు. ప్రకాష్రాజ్ కి ఇది నిజంగానే కొత్త పాత్ర. బాగా అండర్ ప్లే చేశాడు. చాలా బాగుంది. జయసుదకి ఇది రొటీన్ పాత్రే. బాగానే చేసిందని చెప్పక్కర్లేదు. నాకైతే బోరు కొట్టింది. ఆహుతి ప్రసాద్ ఉన్నంతలో లాగించాడు. నాకైతే మొహం మొత్తింది. ఆ స్టైల్ ఆఫ్ డైలాగ్స్ తో. బ్రహ్మానందం ప్రిన్సిపాల్ గా బాగున్నాడు. రెండు మూడు డైలాగ్స్ బాగున్నాయి. ‘రావు రమేష్’ ఫిజిక్స్ లెక్చరర్ గా చేశాడు. నేను మొదటి సారి విన్నాను. ఓ మాదిరిగా ఉన్నాడు. ఐతే అతనిది entertaining పాత్ర. మా ఫ్రెండు రావు గోపాల రావు తాలూకన్నాడు. నిజమా అనుకున్నాను. పాటలు: నాకు ఇంట్రెస్ట్ కలిగింది ‘సీతారామశాస్త్రి’ అన్న టైటిల్ చూసి. ఎవరు ఏవి రాశారో తెలీదు. వెళ్ళేసరికే పేర్లు ఐపోయాయి. ‘నిజంగా నేనేనా…’ పాట చిత్రీకరణ బాగానే ఉంది. (మూడో పాట). ‘క‍న్ఫ్యూషన్’ అనే పాటా గుర్తు ఉంచుకోదగ్గదే కానీ కంఫ్యూషన్ గానే ఉంది. మ్యూజిక్ సినిమాకు తగ్గట్టుగానే ఉంది. మాటలు: అసలు చెప్పుకోవాల్సింది వాటి గురించే. కొన్ని మాటలు బాగా పేలాయి. రెస్పాన్స్ బాగా వచ్చింది. అందులోనూ సెకండ్ హాఫ్ లో వచ్చే ‘అన్నయ్యా…’ డైలాగ్ అదిరింది. అలాగే హీరో ఫ్రెండు జల్సాని మూడు సార్లు చూశానంటే హీరో ‘అన్నిసార్లూ అర్ధం కాలేదా?”‘ అంటాడు. అదీ బాగానే ఉంది. క్లాసులో ‘టీనేజ్, యంగేజ్, మిడిలేజ్’ గురించి రావు రమేష్ చెప్పే సన్నివేశం లో డైలాగ్స్ బాగున్నాయి. అశ్లీలతలు లేక పోవటం బాగుంది. కెమెరా: అవేరేజ్. మూడో పాటలో మాత్రం బాగుంది. అనవసరపు హడావిడి లేకుండా చక్కగా తీశారు. ఎవరో తెలీదు. ఫైట్స్: ఒక్కటే ఉంది. క్రికెట్ ఫీల్డింగ్ లాగా. బాగుంది. సినిమా చూడొచ్చా?: నిక్షేపంలాగా. ఐతే ఒక్కసారి మాత్రమే. హెచ్చరిక: సినిమాలో హీరో తో కబుర్లాడుతూ హీరోయిన్ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుదాం. అప్పుడు చాలా హ్యాపీ గా ఉండొచ్చు అంటుంది. ఇంకా డైలాగ్స్ ఉన్నాయి. మరీ చెప్పెయలేముగా! ఇది చాలు సినిమా చూడోచ్చోలేదో నిర్ణయించుకునేందుకు. పాపం ఆ అమ్మాయి అమాయకురాలనుకుంటా. ఇదే సినిమా గురుంచి "నవతరంగం"లొ సూర్యప్రకాష్ గారు ఎమన్నారొ చూద్దాం అసలు ఈ సినిమా కథ హ్యాపీడేస్ లాంటి ప్లేవర్ తో ఫస్టాఫ్ పూర్తి చేసి ప్రేమిస్తే లాంటి సంఘటనలతో సెకండాఫ్ నడుపుదామనకున్నప్పుడే సగం ప్లాబ్లం ప్రారంభమయ్యింది. ఎందుకంటే కాలేజి జీవితాన్ని ఉషారుగా చూపే పాప్ కార్న్ మోడ్ లో సాగ్ హ్యాపీడేస్ లో సంఘటనలకీ, ఉన్నదున్నట్లుగా వాస్తవంగా సన్నివేశాలతో నడిచే ప్రేమిస్తేని ముడి పెట్టడం చాలా కష్టం . అయినా ఈ స్కీమ్ ఫాలో కావటంతో సెకండాఫ్ లో హీరో,హీరోయిన్స్ కలిసే సన్నివేశాలే అసలు కథలో లేకుండా పోయాయి. దాంతో అప్పటి వరకూ వారి స్వీట్ రొమాన్స్ ని ఎంజాయి చేసిన ప్రేక్షకుడు హఠాత్తుగా కథ ఇలా డ్రైగా మారటం జీర్ణించుకోలేని విషయం. అలా కాకుండా తేజ రెగ్యులర్ నువ్వు-నేను,జయం స్కీమ్ వెళ్ళి పోయి టీనేజ్ ప్రేమ కథను అందర్ని ఎదిరించి పూర్తిగా గెలిపించే ప్రయత్నం చేసినే సమస్య లేకుండా పోయేది. అలా కాకుండా సందేశం చెప్పాలి…మరో ప్రక్క టీనేజ్ ప్రేమకథను చూపాలనే ప్రయత్నం చేయటం వల్లనే ఈ ప్రమాదం వచ్చింది. దాంతో అసలు దర్శక,రచయిత ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు అన్న క్లారిటీని ప్రేక్షకుడుకి అందించటం మిస్సవటం జర్గింది. అదే ఇదే బ్యానర్ లో గతంలో వచ్చిన బొమ్మరిల్లు సినిమాలో ఫస్ట్ సీన్ లోనే మా సినిమా తండ్రి కొడుకుల సమస్య అని స్పష్టం చేస్తాడు. అలాగే ఈ సినిమాలో దర్శకుడు ఫాలో అయిన ప్రేమిస్తే లోనూ ఫస్ట్ సీన్ లోనే ప్రపంచం ఇంకా తెలియని ప్రేమజంట లేచిపోవటం తో ప్రారంభించి ఓ పిచ్చివాడిని చూపి చివరకు ఇలాగే కథ ముగుస్తుంది…రియలిస్టిక్ ఎప్రోచ్ ఉన్న సినిమా అని హింట్ దర్శకుడు ఇస్తాడు. అలాగే ఈ దర్శకుడు మనసు పడ్డ మరో సినిమా మరో చరిత్ర (హీరో హీరోయిన్ల పేర్లు స్వప్న,బాలు) సినిమాలో నూ కథ ఓ పాత కాలం బిల్డింగ్ పై ఓపెన్ చేసి ఇది ఓ విషదాంత ప్రేమకథ అని చెప్పి ఫాలో అవ్వమంటాడు. ఆ చిత్రంలో హైలెట్ గా నిలిచే మన మధ్య ఉన్నది ఆకర్షణా,ప్రేమ అన్న విషయం తేల్చుకోవాలి అన్న పాయింట్ ని తీసుకున్న దర్శకుడు ఈ క్లారిటీని తన సినిమాలో మిస్సయ్యాడు.

మీరిది చూసారా..?

1. మాయాబజార్ సినిమాలో జరిగేది అర్జునుడి కొడుకు పెళ్ళి. కాని పాండవులెక్కడా కనపడరు. మీరు గమనించారా? 2. రాయలసీమకు ఆ పేరు పెట్టి ఎన్నాళ్ళో కాలేదు అంతకు ముందు దాన్ని దత్తమండలం అనేవారు. ఆ పేరెవరు పెట్టారు? 3. "బావా బావా పన్నీరు" పాట వ్రాసిందెవరు? వీటికి సమాధానాలు తెలుగు విజ్ఞాన సర్వస్వం -te.wikipedia.org. - లో ఉన్నాయి. మీరూ, నేనూ, మనవంటి వాళ్ళందరూ కలిసి సమష్టిగా రాస్తున్న సర్వస్వమిది. మనకేం తెలుసు, మనమేం రాయగలము అని అనుకోకండి. కాదేదీ కవితకనర్హం లాగా మనకు తెలిసిన ఏ విషయమూ చిన్నది కాదు. తెలుసు కాబట్టి అది మీకు చిన్నది.. కాని తెలియని నాకు...అది పెద్దదే, కొత్తదే. ఒకసారి చూడండి. మీరూ ఓ వ్యాసం రాయండి. మీ ఊరి గురించో, మీకు తెలిసిన గొప్ప వ్యక్తి గురించో, ఓ సంఘటన గురించో, చరిత్రో, సైన్సో.. ఏదైనా రాయొచ్చు..పూర్తి తెలుగులో. మీకు దాని అవసరం ఉంది. మీ అవసరం అక్కడ చాలా ఉంది.

సుబ్రమణ్యపురం

తమిళోళ్ళు సామాన్యులు కాదు. ఒక పరుతి వీరన్, ఒక కల్లూరి, ఒక ఆటోగ్రాఫ్, ఒక తమిళ్ MA. తమ నేటివిటీ కి ఈ మాత్రం లోపం రాకుండా వాస్తవానికి దగ్గరగా సినిమాలు తీస్తూ కమర్షియల్ గా విజయం సాధించడం వీళ్ళ తర్వాతే అని చెప్పొచ్చు. ప్రస్తుతం తమిళంలో సినిమాలు తీస్తున్న దర్శకుల్లో బాల, అమీర్ లు తమ సినిమాలతో ఇప్పటికే మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళిద్దరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శశికుమార్ దర్శకత్వంలో వచ్చిన సుబ్రమణ్యపురం సినిమా ఈ దశాబ్దపు ఉత్తమ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఈ సినిమా కథ చెప్పి ఈ సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులను నిరాశ పరచడం ఇష్టం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే “1980 లలో మధురై లోని సుబ్రమణ్యపురం లో నివసించే ఒక ఐదుగురి యువకుల కథ ఇది”. కథ, కథనం తో పాటు బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ, సరైన సంగీతం ఈ సినిమాని ఒక మాస్టర్ పీస్ గా నిలబెడుతుంది.ఈ సినిమా నాకు బాగా నచ్చడానికి కొన్ని కారణాలు: 1. కథ మొదలైన తీరు నచ్చకపోయినా సినిమా ముగిసే సరికి కథ అలానే మొదలవ్వాలని దర్శకుడు కన్విన్స్ చేయగలగడం. 2. అంతా కొత్త వారైనా ప్రతి నటుడూ తమ పాత్రను అధ్భుతంగానే కాదు అవలీలగా పోషించారు. 3. ఈ సినిమాలో హీరో లంటూ ఎవరూ లేకపోవడం. 4. 1980 కాలాన్ని అత్యంత నేర్పుగా రిక్రియేట్ చేయడం. 5. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో ఒక సినిమా తీసి దాన్ని బ్లాక్ బస్టర్ గా మలచిన తీరు. 6. మన టివిల్లో యాంకర్ గా ఒక వాగుడుకాయగా పరిచయమున్న స్వాతి కళ్ళతోనే గొప్ప నటన ప్రదర్శించింది. 7. పరుతి వీరన్, కల్లూరి, తమిళ్ MA సినిమాలలో క్లైమాక్స్ సెన్సేషనలైజ్ చేయకుండా ఈ సినిమా క్లైమాక్స్ కేవలం అంతకముందు జరిగిన సంఘటనల natural consequence గా మాత్రమే వుంటుంది. 8. వయొలెన్స్ అధికంగా వున్న సినిమా అయినా ఈ సినిమాలో అధిక శాతం వయొలెన్స్ మన మైండ్ లో ఊహించుకుంటాం కానీ తెరపై మనకి కనిపించదు. 9. ఈ సినిమాలో అణువణువనా వ్యక్తమయ్యే రియలిజం. 10. మొదటి పదిహేను నిమిషాలు తప్పితే ఊపిరి సలుపుకోలేని వేగంతో నడిచే కథనం. ఒక వేళ మీకు పరుతి వీరన్, ఆటోగ్రాఫ్, కల్లూరి లాంటి సినిమాలు నచ్చుంటే ఈ సినిమా కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక వేళ మీకా సినిమాలు నచ్చకపోతే ఈ సినిమా మీకు గ్యారంటీగా నచ్చుతుంది. ఇంకా కాదు అంటే మీకు పల్ప్ ఫిక్షన్, సిటీ ఆఫ్ గాడ్స్ నచ్చి వుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక వేళ మీకా సినిమాలు నచ్చలేదంటే దయచేసి ఈ సినిమా కి దూరంగా వుండండి.ఈ సినిమా మీలాంటి టేస్ట్ లేని వాళ్ళకు కాదు.

rock on

నాలాగ మీకు ఇండియన్‌రాక్ లో ఏ కొంచెం ఆసక్తి వున్నా, ఈ సినిమా ‘GOD’ సినిమా అనిపించి తీరుతుంది. ఈ సినిమాలో లోట్లు వున్నాయి కానీ, నేను సినిమాలో ఎంత మైమరచి పోయానంటే, అవన్నీ ఏం తట్టలేదు. ఇప్పుడు ఆలోచిస్తే, సినిమాలోని కొన్ని లోట్లు, ౧) జో నౌక ఎక్కడానికి వెళ్తూంటే, కారు సరిగ్గా వీళ్ళ కాంసెర్ట్ ముందు ఆగడం. ముంబాయి లాంటి మహానగరాల్లో ఇలాంటిది జరగడం, కొంత కష్టమే. ౨) రాబ్ కి బ్రెయిన్ ట్యూమర్ పెట్టడం కొద్దిగా పాత సినిమా తరహాలో వుంది. కానీ కథలో కాంప్లికేషన్ కోసం ఇలాంటిది చేయాల్సివుంది. నాకీ రెండే తడుతున్నాయి. ఇంకా చిన్న చిన్నవి వున్నా, వాటిని పెద్దగా పట్టించుకోనక్కరలేదు. ఇక ఫర్హాన్ , రాంపాల్ పాత్రల విషయమై, ఫర్హాన్ పాత్ర ఆదిత్యలో కంటే, అర్జున్ పాత్ర జోలోనే ఎక్కువ డెప్త్ వుంది. ఆదర్శాలు ఎక్కువ వున్న పాత్ర జో. కాబట్టి ఎప్పటికైనా ఆ పాత్రకే మంచి గుర్తింపు వస్తుంది. ఈ సినిమా అర్జున రాంపాల్ కి మంచి గుర్తుంపునివ్వాలి. ఫర్హాన్ కూడా మరీ అతిగా చేయకండా, మిగిలిన నటులకు తగిన ప్రాముఖ్యతనిచ్చాడు. ఇక మంచి విషయాలు చెప్పవస్తే, ౧) ఇండియన్-రాక్ ఇష్టముంటే, ఈ సినిమాలో సంగీతం చాలా చాలా బాగుంటుంది (నా అభిప్రాయం - నేనైతే సీడి కొన నిశ్చయించాను), మీరు రెహమాను సంగీతమో, ఇళయరాజ సంగీతమో ఆశించివెళితే, కాస్తంటే కాస్త నిరాశ కలుగవచ్చు. ౨) స్క్రిప్టు - ఆదిత్యకి అతని భార్యకి మధ్య సంఘర్షన చాలా బాగుంది. అలానే, బ్యాండులో చిన్నచిన్న చీలికలు వచ్చి అవి పెద్దగా మారడాన్ని చాలా నెమ్మదిగా సహజంగా చిత్రీకరించారు. (మన అత్తకోడళ్ళ మధ్య ఒక పూటలో గొడవలు జరగడం లాంటిది కాకుండ.) ౩) కెడి, రాబ్ ల సంబంధం వారి పాత్రల చిత్రీకరణ చాలా బాగున్నాయి. ౪) మన తెలుగు సినిమాల్లో, హీరో గారు ఏదో వాయిస్తూవుంటారు, అక్కడ సంగీతం ఏదో వస్తూంటుంది. అలా కాకుండా, చాలా సహజంగా వుంది, రాంపాల్ గిటారు వాయించడం, మఱియు కెడి డ్రమ్ములు వాయించడం. ౫) నాన్ లీనియర్ కథనం - ఈ తరహా కథనం చాలా కష్టం, గమ్యంలో క్రిష్ ఇలాంటిది ప్రయత్నించాడు కాని, అంత సఫలమవ్వలేదు. అదీ పదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళడమంటే, ఇంకా కష్టమవుతుంది. (జుట్టూ మీసాలు పెంచేస్తే సరిపోదు). ఈ సినిమాలో ఈ టెక్నిక్ ని చాలా బాగా ఉపయోగించుకున్నారు. ౬) కాంసెర్ట్ సన్నివేశాలన్నీ చాల సహజంగా వచ్చాయి. ఇంగ్లీషు సినిమాల్లోలాగ (వాసు సినిమాలోలో కాకుండ). స్థూలంగా చెప్పాలంటే, ఈ సినిమాలోని సాంకేతికాంశాలను చాలా పటిష్ఠంగా ఉంచుతూనే, చాలా మంచి అనుభూతిని కలిగించింది. దీన్ని మాస్టర్ పీస్ అని అనలేమేమోగాని, ఒక కొత్త పుంత త్రొక్కి అందులో చాలా దూరం వెళ్ళవచ్చని నిరూపించిన సినిమా ఇది. ‘దిల్ చాహతా హైఁ’ కంటే ఒక పదడుగులు ముందుకు వేసింది. వీలైతే ఈ సినిమా చూడండి, లేకుంటే డీవీడి కొనండి. సినిమాలో చెప్పినట్లు అక్రమంగా దిగుమతి చేసుకోవద్దు. (ఇది అష్టా-చెమ్మా కు కూడా వర్తిస్తుంది.)

charitra

సినిమా

సినిమా అనేది ఒకరకంగా చెప్పాలంటే దృశ్యరూపంలోని సాహిత్యమే. ఇది రంగస్థలమ్మీద ఒకసారి ఆడి ఆగిపోయే బదులు వెండితెరమీద మళ్ళీమళ్ళీ ఆడించడానికి వీలయ్యేలా రూపొందే నాటకం, దృశ్యరూపంలోని ఒక కావ్యం, ఒక నవల లేదా ఒక కథ. తెలుగులో టాకీలొచ్చిన తొలినాళ్ళలోనే ప్రసిద్ధి పొందిన కన్యాశుల్కం, వరవిక్రయం లాంటి నాటకాలు సినిమాలుగా వచ్చాయి. ఆ రోజుల్లోనే నవలల్లో నుంచి ‘బారిష్టర్ పార్వతీశం’, ‘మాలపిల్ల’లు కూడా వెండితెర మీద సాక్షాత్కరించారు. చలం రాసిన ‘దోషగుణం’ అనే చిన్నకథ కూడా ఇటీవలే సినిమాగా వచ్చింది. ఐతే ఏ సాహితీరూపమైనా ఎటువంటి మార్పులూ లేకుండా యథాతథంగా తెరమీదికెక్కదు. లిఖితమాధ్యమానికి, దృశ్యమాధ్యమానికి మధ్య ఉన్న మౌలికమైన తేడాలు, ఆ రెండుమాధ్యమాలకు ఉన్న వేర్వేరు పరిమితులు ఈ మార్పులకు కారణాలు. ఉదాహరణకు ఒక నవలనే తీసుకుంటే సాధారణంగా ఒక రచయిత తనకు ఏం రాయాలనిపిస్తే అది, ఎలా రాయాలనిపిస్తే అలా లేదా తానెలా రాయగలిగితే అలా రాసేస్తారు. వీలైనంతవరకు తనకు నచ్చిన విధంగా నవల రాసుకునే వెసులుబాటు, స్వేచ్ఛ ఆ రచయితకు ఉంటాయి. ఒక ఆలోచన వచ్చిన వెంటనే కుదురుగా కూర్చుని ఏకధాటిగా రాసుకుపోవచ్చు రచయిత. ఐతే సినిమా అలా కాదు. ఒకరికి వచ్చిన ఊహ లేక ఆలోచనకు దృశ్యరూపమివ్వడానికి ఎంతో మంది కలిసి శ్రమిస్తేగానీ ఒక సినిమా తెరకెక్కదు. సినిమా శిల్పమనేది కథాశిల్పానికంటే, నవలాశిల్పానికంటే వేరుగా ఉంటుంది. సినీమాధ్యమానికున్న సాంకేతిక పరిమితుల వల్లా, ఆర్థిక పరిమితుల వల్లా, భిన్న వర్గాలకు చెందిన ప్రేక్షకుల అభిరుచులు, అవగాహనాస్థాయిల్లోని తేడాల వల్లా దీనికి కొన్ని ప్రత్యేక లక్షణాలు అలవడ్డాయి. ఆ ప్రత్యేక లక్షణాలు కథల ఎంపిక, కథను నడిపే తీరు (కథాకథనం), పాత్రధారుల ఎంపికలో వివిధరకాలుగా వ్యక్తమవుతాయి. కథల ఎంపిక: సినిమా తీయాలంటే అన్నిటి కంటే ముందుగా కావలసింది కథ. ఎవరెన్ని రకాలుగా చెప్పినా కథే సినిమాకు ప్రాణం. నేల విడిచి సాము చేసే ఉత్సాహంలో కొందరు నిర్మాతలు ఈ ప్రాథమిక సూత్రాన్నే మరిచిపోయి పెద్ద పెద్ద తారలు, సాంకేతిక నిపుణులతో డేట్లు కుదుర్చుకుని, తాము తీయబోయే సినిమా చరిత్ర సృష్టిస్తుందని ఆశపడి భారీగా ఖర్చుపెట్టి భంగపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. నటుల లేక సాంకేతిక నిపుణుల సామర్థ్యం కథాబలాన్ని పెంచడానికి, కథను మరింత బాగా ప్రెజెంట్ చెయ్యడానికీ ఉపయోగించుకోవాలే తప్ప అవుంటే చాలు సినిమా ఆడేస్తుందని భ్రమలు పెంచుకోరాదు. సినిమాలకు ఎలాంటి కథల్ని ఎంచుకోవాలి? ఎలాంటి కథలనైనా ఎంచుకోవచ్చు. పౌరాణికాలతో మొదలై సాంఘికాలు, జానపదాలు, చారిత్రకాలు…ఇలా కొనసాగిన సినీప్రస్థానంలో ప్రతీకాత్మక కథలు (Allegories: ‘ఉపేంద్ర ‘ సినిమా), ‘ఆదిత్య 369′ లాంటి సైన్స్ ఫిక్షన్ కథలు తీసి కూడా ప్రేక్షకులను మెప్పించవచ్చని ఉపేంద్ర, సింగీతం శ్రీనివాసరావు లాంటి సాహసికులు నిరూపించారు. కాలాన్ని బట్టి, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులను బట్టి కథలను ఎంచుకోవాలి. బాగా తీస్తే జానపదాలకు, పౌరాణికాలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదని భైరవద్వీపం, బాలల రామాయణం నిరూపించాయి. సాంఘిక చిత్రాల విషయానికి వస్తే ఒకప్పుడు యాంటీ సెంటిమెంటు కథలను ప్రేక్షకులు తిరస్కరించారు. మారిన సామాజిక పరిస్థితుల వల్ల ఇప్పుడంత వ్యతిరేకత లేదు. ఒకప్పుడు సెంటిమెంటు డోసు ఎక్కువైనా జనం ఎగబడి చూసేవారు. ఇప్పుడు వెనుకాడుతారు. ఐతే ఎలాంటి కథనెన్నుకున్నా అది సగటు ప్రేక్షకులకు నచ్చాలనేదే సినీమాధ్యమంలో తారకమంత్రం. కథనం: కథ చెప్పే (లేక కథ నడిపే) విధానమే కథనం. ఎంత మంచి కథనెన్నుకున్నా కథనసామర్థ్యం లేకపోతే ప్రేక్షకులకు, తద్వారా నిర్మాతకు నిరాశే కలుగుతుంది. సినిమాకు ఎలాంటి కథనెన్నుకున్నారని కాక ఎన్నుకున్న కథను ఎంత ఆసక్తికరంగా చెప్పారన్నదే సాధారణంగా చిత్రవిజయాన్ని, పరాజయాన్ని నిర్ణయిస్తుంది. కొన్ని కథలు టూకీగా (ఔట్‌లైన్) వింటే అద్భుతమనిపిస్తాయి. నిర్మాతలు కూడా ఆ నమ్మకంతోనే చిత్రనిర్మాణానికి సిద్ధపడుతారు. కానీ వాటిని ట్రీట్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళేసరికి క్రమంగా బలహీనపడి చివరికి చాలా పేలవంగా మారి నీరుగారిపోతాయి. మరికొన్ని కథలు ఔట్‌లైన్ వింటే సాదాసీదాగా అనిపిస్తాయి. కానీ అవేకథలకు సరైన ట్రీట్‌మెంట్ కుదిరితే ఘనవిజయం సాధిస్తాయి. మారుతున్న కాలంతోబాటే కథనరీతులు కూడా మారుతూ ఉంటాయి. కథను ఆసక్తికరంగా నడిపించడానికి లిఖిత సాహిత్యంలో అవసరం లేని/అవసరం రాని కొన్ని అదనపు లక్షణాలు సినిమా కథలకున్నాయి - ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటివి. (ఇంటర్వెల్ బ్యాంగ్: రాతలో ఉన్నప్పుడు ఎంత పెద్ద నవలకైనా మధ్యలో విశ్రాంతి లాంటివేవీ ఉండవు. పాఠకుడికెప్పుడనిపిస్తే అప్పుడే ఇంటర్వెల్..ప్రొజెక్టర్ అతడి చేతిలోనే ఉంటుంది కాబట్టి! (ఇక్కడ పుస్తకమే ప్రొజెక్టర్). కానీ సినిమాల్లో (ముఖ్యంగా మన భారతీయ సినిమాల్లో) భవిష్యత్తు సంగతి చెప్పలేం గానీ ఇప్పటి పరిస్థితుల్లో మాత్రం సినిమా నిడివి దృష్ట్యా ఇంటర్వెల్ తప్పనిసరిగా ఉంటుంది. సినిమాకొచ్చిన ప్రేక్షకులు ఇంటర్వెల్ వరకూ చూసి బోర్ కొట్టి వెళ్ళిపోకుండా నిలబెట్టేందుకైతేనేమి, తర్వాతేం జరగబోతోందోననే ఆసక్తి రేకెత్తించడం కోసమైతేనేమి ఇంటర్వెల్ బ్యాంగ్ అనే టెక్నిక్ ను (తప్పనసరిగా కాదుగానీ) ఎక్కువగా వాడుతారు. అంటే కథను ఒక ఆసక్తికరమైన లేక ఊహాతీతమైన మలుపు తిప్పి, ఏం జరుగుతోందో ప్రేక్షకులకు అర్థమై, ఏం జరగబోతోందో అని వాళ్ళలో ఉత్కంఠ రేగేవేళ, సరిగ్గా అప్పుడే ఆ మలుపులోనే ఇంటర్వెల్ కార్డు పడేస్తారు. కథ నడపడంలో ఇదో టెక్నిక్) పాత్రల పరిచయం: “అనగనగా ఇద్దరు అన్నదమ్ములు. అన్న మంచివాడు, తమ్ముడిదేమో దొంగబుద్ధి…” అని చందమామ కథ లో లాగ మొదలయ్యే కథకు దృశ్యరూపమివ్వాలంటే వీడు మంచివాడు, వాడు చెడ్డవాడు అని ఒక్క ముక్కలో చెప్పడానికి వీల్లేదు. ప్రతిదీ సన్నివేశాలపరంగానే చెప్పాలి. వీడి మంచితనం, వాడి చెడ్డతనం ప్రేక్షకులకు ఇట్టే అర్థమయ్యేటట్లు ఒకటిరెండు సన్నివేశాల్ని సృష్టించాలి. ఐతే ఇందుకు ప్రత్యేకంగా సన్నివేశాలను సృష్టించనవసరం లేకుండా కథాగమనంలోనే - అదీ కథాప్రారంభంలోనే - వారి స్వభావాలు తేటతెల్లమయ్యేటట్లు చూడ్డం ఇంకొక పద్ధతి. ఈ పద్ధతిలో కథనం చిక్కగా ఉన్నట్లనిపించినా సంభాషణలు కృతకంగా ఉండకుండా జాగ్రత్త వహించాలి. గతంలో శ్రీవారికి ప్రేమలేఖ, మంచుపల్లకి లాంటి సినిమాల్లో ఒక సన్నివేశంలో ఒక పాత్రను చూపించి, ఆ పాత్ర మీద కెమెరా ఫ్రీజ్ చేసి “ఈ మనిషి ఇలాంటివాడు” అని బ్యాక్ గ్రౌండు నుంచి చెప్పించారు. ఈ పద్ధతి ఇప్పుడు చెల్లదు. ఇటీవల వస్తున్న కొన్ని సినిమాల్లో పాత్రల పరిచయం, మరి కొన్ని సరదా సన్నివేశాలతో ఇంటర్వెల్ వరకు నడిపించి, ఆ తర్వాతే అసలు కథలోకి వెళ్తున్నారు. పాత్రధారుల ఎంపిక: పాత్రలకు తగిన పాత్రధారులను ఎంచుకోవడం నిజంగా కత్తిమీదసామే. కథ, కథనాలు బాగున్నా కేవలం కాస్టింగు(పాత్రలకు సరిపోయే పాత్రధారులు) నప్పకపోవడం వల్ల సినిమాలు ఫెయిలైన సందర్భాలు ఉన్నాయి. నటీనటుల నటనా సామర్థ్యంతో బాటు వాళ్ళ విగ్రహం, ఆంగికం, వాచికం లాంటివి అన్నీ పాత్రకు సరిపోతేనే ఆ పాత్రకు తీసుకోవాలి. లేకపోతే అపాత్రతే అవుతుంది. (ఇప్పుడు కాస్త నయం. నటుడి గొంతు బాలేకపోతే డబ్బింగు ఆర్టిస్టుది అరువు తెచ్చుకోవచ్చు.) ఇవేవీ కాకుండా కేవలం ఆయా నటులకు ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్ పాత్ర స్వభావానికి సరిపడకపోవడం కూడా కొన్నిసార్లు కాస్టింగును దెబ్బతీస్తుంది. ప్రేక్షకులు కొందరు నటులను కొన్ని రకాల పాత్రల్లో ఆదరించినంతగా ఇతరపాత్రల్లో ఆదరించరు. దీనికితోడు మరికొన్ని ప్రత్యేక కారణాల వల్ల తెలుగులో కనీసం ఇద్దరు ప్రముఖ హీరోలు కలిసి నటించే మల్టీస్టారర్ సినిమాలు రావడం పూర్తిగా తగ్గిపోయింది. అభిమానుల అభిమానం వెర్రితలలు వేసి నటులు తమ ఇమేజ్ చట్రంలో తామే బందీలయ్యే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అసాధారణ నటనాసామర్థ్యముండి కూడా ఇమేజ్ పరిమితులకు లొంగని నటులు ఆ కాలంలోనూ (ఎస్వీ రంగారావు), ఈకాలంలోనూ (కమల్ హాసన్) ఉన్నారు. సినీమాధ్యమానికున్న పరిమితులు: సాంకేతిక పరిమితులు: రచయితదేం పోయింది? నవల్లోని పాత్రలు అసాధ్యమైన ఫీట్లు చేసినట్లుగా రాసిపారేస్తారు. దాన్ని తెరమీదకెక్కించాలంటే దర్శకనిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, నటీనటులకు అందరికీ చుక్కలు కనిపిస్తాయి. ఐతే కె.వి.రెడ్డి లాంటి మాయామేయ దర్శకుడికి మార్కస్ బార్ట్లే లాంటి ఛాయాగ్రాహకుడు తోడైనప్పుడు ఇలాంటి పరిమితులూ అవాక్కైపోయి నోరు తెరుచుకుని సినిమా చూసేస్తాయి. ఆర్థిక పరిమితులు: రచయితకొచ్చిన ఒక ఆలోచన దృశ్యరూపంలో సాక్షాత్కరించడానికి డబ్బులు కావాలి. ఇంకా దానికెంతో మంది సాంకేతికనిపుణుల సహకారముండాలి. అందరి మధ్యా గొప్ప సమన్వయముండాలి. (ఒక్కోసారి “వంటగాళ్ళెక్కువై వంట చెడిపోవడం” కూడా జరుగుతూ ఉంటుంది.)ఇంతా ఖర్చు పెట్టి, ఇంతమంది కలిసి ఇంత శ్రమ పడ్డాక దాన్నెవరూ చూడకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. నిర్మాత మునిగిపోతాడు. కాబట్టి తీసే సినిమాను జనాలకు నచ్చేటట్లు జనరంజకంగా తీయాలని నిర్మాత ఆశించడంలో తప్పులేదు. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా సినిమాలు తియ్యడం అందరివల్లా అయ్యేపని కాదు. అందుకే నిర్మాతలు ప్రేక్షకుల్లో ఒక వర్గానికి బాగా నచ్చే సినిమాలు తీయడం మొదలుపెట్టారు. గతంలో మహిళా ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కడవలకొద్దీ కన్నీళ్ళు కార్పించే సినిమాలు తీశారు. యువతరాన్ని థియేటర్ల వైపు ఆకర్షించడానికి ఒకప్పుడు ఫైట్లు, డాన్సులు పనికొస్తే ఇప్పుడు శృంగారానికీ, బూతులకే అగ్రతాంబూలమిస్తున్నారు. ఇది ఈమధ్య తరచుగా శృతిమించుతోంది కూడా. లక్షిత ప్రేక్షకులు/టార్గెట్ ఆడియెన్స్: సాహిత్యం పుస్తకాల్లో ఉన్నంతవరకు దాన్ని చదివేవాళ్ళు సాధారణంగా సాహిత్యం పట్ల ఒక అభిరుచి, అవగాహన ఉన్నవాళ్ళై ఉంటారు. వారి అభిరుచికి, అవగాహనాస్థాయికి సరిపోయేవిధంగా రాసే సాహిత్యం చదివేవారికి అద్భుతంగా నచ్చినా యథాతథంగా తెరమీదికెక్కిస్తే సగటుప్రేక్షకులకు ఎక్కకపోవచు. వినోదం కోరి సినిమాలకొచ్చే సగటు ప్రేక్షకులు సినిమాల్లో వాస్తవికతను జీర్ణించుకోలేకపోవచ్చు లేదా కొత్తదనాన్ని ఆమోదించకపోవచ్చు. జనరంజకాలైన పాటలు లేవనో, కామెడీ లేదనో అసంతృప్తి చెందే అవకాశమే ఎక్కువ. కాలాతీతవ్యక్తులు నవలను ‘చదువుకున్న అమ్మాయిలు’ గా తీసినపుడు కథను దాదాపు పూర్తిగా మార్చివేశారు. ఆ నవల అంతగా ప్రసిద్ధం కావడానికి కారణమైన ఇందిర పాత్ర ప్రవర్తననుగానీ, ఆ పాత్ర మనస్తత్వ చిత్రణను గానీ సగటు ప్రేక్షకులు జీర్ణించుకోలేరనేమో పూర్తిగా మార్చేశారు. చిత్రనిర్మాణంలో ముఖ్యంగా మూడు దశలున్నాయి. అవి: * ప్రి-ప్రొడక్షన్ * ప్రొడక్షన్ * పోస్ట్-ప్రొడక్షన్ షూటింగుకు అవసరమయ్యే సన్నాహకాలన్నీ జరిగేది ప్రి-ప్రొడక్షన్ దశలో. చిత్రనిర్మాణంలో ఇది అత్యంత కీలకమైన దశ. అసలు దీంట్లోనే చిత్రనిర్మాణానికి సంబంధించిన తొంభై శాతం పని పూర్తవుతుంది. కథ నిర్ణయం, బడ్జెట్ తయారీ, కథాచర్చలు, స్క్రిప్టు, స్క్రీన్‌ప్లేల ఖరారు, క్యాస్టింగు, ఇతర సిబ్బంది, షూటింగు లొకేషన్ల నిర్ణయం, ఔడ్డోర్ యూనిట్ ఎంపిక, పాటల నిర్ణయం, పాటల రచన, పాటల రికార్డింగు, మొదలైనవన్నీ ఈ దశలోనే జరుగుతాయి. ప్రొడక్షన్ దశలో షూటింగు జరుగుతుంది. మిగతా సినిమా అంతా షూటింగయ్యాక డబ్బింగ్ జరిగితే పాటల విషయంలో మాత్రం రికార్డింగ్ తర్వాతే షూటింగ్ జరుగుతుంది. షూటింగు తర్వాత పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఎడిటింగ్, డబ్బింగ్, సెన్సారింగ్, ప్రింట్లు వెయ్యడం, డిస్ట్రిబ్యూషన్, చివరగా ఎగ్జిబిషన్ జరుగుతాయి. ఇప్పుడు వీటిలో ఒక్కొక్క అంశాన్ని గురించి విశదంగా తెలుసుకుందాం: ప్రి-ప్రొడక్షన్ కథ నిర్ణయం: సినిమా పని కథనెన్నుకోవడంతో మొదలౌతుంది. ఎంత పిచ్చివాళ్ళు కూడా కథ ఫలానా అని అనుకోకుండా సినిమా పని మొదలుపెట్టరు. ఈ కథనెలా నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయిస్తారు? అనేవి తర్వాతి ప్రశ్నలు. నిర్మాత లేదా దర్శకుడు తమంతట తామే ఒక కథనెన్నుకుని లేదా కథను రూపొందించుకుని దాన్ని సినిమాగా తియ్యాలనుకోవడం ఒక పద్ధతి. అలాకాకుండా ఇంకో పద్ధతిలో ఐతే కథారచయిత తన కథను తీసుకుని దర్శకుడు లేదా హీరోలను కలవడం, వాళ్ళకు ఆ కథ నచ్చితే, వాళ్ళు ఆ కథను తమ నిర్మాతలకు సిఫార్సు చెయ్యడం జరుగుతుంది. లేదా రచయితలు తమ కథను నేరుగా నిర్మాతకే వినిపించడం ఇంకొక పద్ధతి. ఎందుకంటే సినిమాకు నిర్మాతే చోదకుడు. ఇంకా చెప్పాలంటే సినిమాకు నిర్మాతే సొంతదారు. అందుకే ఉత్తమ చిత్రం పురస్కారం నిర్మాతలకే ఇస్తారు. ఇది ప్రపంచమంతటా నెలకొని ఉన్న సంప్రదాయం. ఐతే తెలుగు సినిమా చరిత్రనొకసారి పరిశీలిస్తే మొదటి దశలో (1931 నుంచి 1950 దాకా దాదాపు ఇరవై సంవత్సరాలు) దర్శకుడికి ఎక్కువ ప్రాధాన్యతుండేది. హెచ్.ఎం.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, గూడవల్లి రామబ్రహ్మం, మొదలైన దర్శకులు చలనచిత్రరంగానికి చుక్కానులుగా ఉన్నారు. (వాళ్ళు దర్శకనిర్మాతలైనా నిర్మాతలుగా కంటే దర్శకులుగానే ప్రసిద్ధులయ్యారు.) తర్వాత విజయా, ఏ.వీ.ఎం. లాంటి సంస్థల ఆవిర్భావంతో నిర్మాతల శకం వచ్చింది. కె.వి.రెడ్డికి, విజయా నిర్మాతలకు మధ్య ఒకరకమైన ఆధిపత్యపోరు కూడా కొంతకాలం నడిచింది. మీరు గమనించారో లేదో జగదేకవీరుని కథ విజయావారి సినిమాయే అయినా నిర్మాతలుగా చక్రపాణి-నాగిరెడ్డి పేర్లకు బదులుగా కె.వి.రెడ్డి పేరే ఉంటుంది. దానికి కారణం ఈ ఆధిపత్యపోరే! తర్వాత 1980 ల నుంచి హీరోల శకం రావడమొక కొత్తపోకడ. కథాచర్చల్లో ఇది ఒక ప్రధానమైన అంశం. ఫలానా కథను సినిమాగా తియ్యాలని నిర్మాత-దర్శకులు నిర్ణయించుకున్నాక కథాచర్చలు మొదలౌతాయి. ఈ కథాచర్చలు నిర్మాత, దర్శకుడు, కథారచయితల మధ్య జరగడం ఆనవాయితీ.కథ నిర్ణయమయ్యాక ముందడుగు పడాలంటే బడ్జెట్ నిర్మాతకు ఆమోదయోగ్యం కావాలి. అయితే ఈ బడ్జెట్ వేసిచ్చే బాధ్యత దర్శకుడిదే! బడ్జెట్: తామనుకున్న కథను సినిమాగా తీయడానికి దర్శకుడు వేసిచ్చిన బడ్జెట్ చూసి నిర్మాత అందుకు సిద్ధపడ్డాకే తర్వాతి అడుగులు పడుతాయి. సినిమాకు అవసరమైన పెట్టుబడి పెట్టేది నిర్మాతే అయినా తాము తీయదలచిన సినిమాకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేయగలిగేది దర్శకుడే. కథ ఖరారు కాగానే ఈ కథను తెరకెక్కించడానికి ఇంత ఖర్చు అవుతుందని దర్శకుడు చెప్పాక అంత పెట్టుబడి అవసరమా? అవసరమైనా తాను అంత పెట్టుబడి పెట్టగలడా అనేది నిర్మాత అలోచించుకుని ముందడుగు వెయ్యడమో, వెనక్కు తగ్గడమో చేస్తాడు. ఈ బడ్జెట్ అంచనాలు వెయ్యడంలో కె.వి.రెడ్డి సిద్ధహస్తుడని ప్రతీతి. ఆయన కథ వినగానే దీనికి ఇన్ని అడుగుల ఫిల్ము అవసరమౌతుంది అని చెప్పేవాడు. షూటింగు పూర్తయాక చూసుకుంటే ఖచ్చితంగా ఆయన చెప్పినంతే వచ్చేది. అలాగే బడ్జెట్ విషయంలో కూడా: మాయాబజార్ నిర్మాణ సమయంలో తెరవెనుక పెద్ద కథలే జరిగాయి. అప్పట్లో సాధారణ సినిమాలకయ్యేదానికి మూడురెట్ల నిర్మాణవ్యయంతో అంచనాలు రూపొందించి, అంతా సిద్ధం చేసుకుని తీరా షూటింగు మొదలుపెట్టే సమయానికి నిర్మాతలకు ధైర్యం చాలక అక్కడితో ఆపేద్దామన్నారట. దాంతో కె.వి.రెడ్డి హతాశుడయ్యాడు. ఎన్నో ఊగిసలాటల అనంతరం నిర్మాతలు ఖర్చెంతవుతుందో చెప్పమని దర్శకుణ్ణి పిలిపించి మళ్ళీ అడిగారు. ఆయన ఎంతో చెప్పి “ఇంతకు మించి మీరు ఒక్క పైసా పెట్టనక్ఖర్లేదు. ఖర్చు నా అంచనాలు దాటినట్లైతే అదనంగా అయ్యే ఖర్చంతా నేనే పెట్టుకుంటాను.” అని వారికి హామీ ఇచ్చిన తర్వాతే రథం మళ్ళీ కదిలింది. బడ్జెట్ మీద దర్శకుడికి ఆ అదుపు లేనట్లైతే సినిమాలు తియ్యాలనే ఉత్సాహంతో వచ్చే చాలా మంది నిర్మాతల దారి గోదారే అవుతుంది. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు కూడా బడ్జెట్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారట: నిర్మాణవ్యయం దర్శకుడు వేసిచ్చిన అంచనాలను మించినట్లైతే దర్శకుడే బాధ్యత వహించవలసి ఉంటుంది. సినిమాలు తీసే ఉబలాటంలో డబ్బుసంచులు పట్టుకుని దిగే ఔత్సాహిక నిర్మాతలు ఊబిలో దిగకుండా ఉండాలంటే ఇలాంటి కట్టుబాట్లు చేసుకోవడం చాలా అవసరం. కథాచర్చలు: కథ నిర్ణయమైనాక కథాచర్చలు మొదలౌతాయి. ఈ కథాచర్చలప్పటికి ప్రధానపాత్రలు ఎవరిచేత వేయించాలో దర్శకనిర్మాతలకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. (ఈ కథాచర్చలనే స్టోరీ సిట్టింగులని, స్టోరీ డిస్కషన్లని అంటారు.) దీనివల్ల స్క్రిప్ట్ రాసే రచయిత కూడా ఆ పాత్రధారులను దృష్టిలో పెట్టుకుని రాసే వీలు కలుగుతుంది. భారీ బడ్జెట్ సినిమాలకు ఇది మరింత అవసరం. ఒక్కోసారి దర్శకుడు లేదా రచయితలు “ఈ కథ ఈ హీరోను దృష్టిలో పెట్టుకునే తయారుచేశాం. ఈ సినిమాను తీయడమంటూ జరిగితే అది ఈ హీరోతోనే తీయాలనుకున్నాం.” అని చెప్పడం మనం వింటూ ఉంటాం. ఐతే అన్ని కథలకూ ఆ అవసరముండదు. కొన్ని కథలు ఎవరితో తీసినా, ముఖ్యంగా ఏ రకమైన ఇమేజ్ లేని నటులతో తీస్తేనే సరిపోయే విధంగా ఉంటాయి. ఈ కథల మాటెలా ఉన్నా పెద్ద హీరోను దృష్టిలో పెట్టుకుని తయారుచేసే కథల్లో ముందుగా ఆ హీరోకు స్థూలంగా ఇదీ కథ అని చెప్పి, కథాచర్చల్లో కూడా ఆ హీరోకు పూర్తి స్వేచ్ఛ - దర్శకనిర్మాతలతో సమంగా - ఇవ్వడం కొత్త పోకడ. ఇక్కడ దర్శకుడు కొత్తవాడైతే నటుడు అత్యుత్సాహంతో తనే దర్శకపాత్ర వహించి సినిమాను చెడగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ కథాచర్చల్లో తప్పనిసరిగా ఉండేదీ, ఉండవలసిందీ దర్శకుడు, నిర్మాత, కథారచయిత. కథారచయిత అని చెప్పడమెందుకంటే సినీరంగంలో కథారచయిత, మాటల రచయిత, పాటల రచయిత, స్క్రిప్ట్ రచయిత, స్క్రీన్ ప్లే రచయిత…ఇన్నిరకాల రచయితలుంటారు. అరుదుగా కామెడీ ట్రాక్ రచయితలు కూడా వేరేగా ఉంటారు. వీళ్లలో ఒక్క కథారచయిత తప్ప మిగిలినవాళ్ళంతా తర్వాతిదశల్లో రంగప్రవేశం చేస్తారు. ఐతే ఒక్కోసారి తమ కథ వెండితెరకెక్కడమే మహాభాగ్యంగా భావించే రచయితలు కొందరు ఆ కథ లో ఎలాంటి మార్పులు చేసినా తమకభ్యంతరం లేదని ముందే ప్రకటించి కథాచర్చల నుంచి తప్పుకుంటారు. స్క్రిప్టు: ఇక్కడ స్క్రిప్టుకు, స్క్రీన్‌ప్లేకు మధ్య గల స్వల్ప తేడా గురించి చెప్పడం అవసరం. మాటలు ప్రేక్షకులకు వినిపిస్తాయి. సరిగ్గా అదే సమయంలో ఆ సన్నివేశంలో ఏం జరుగుతోందో స్క్రిప్టులో రాసుకుంటారు. దాన్ని తెరమీద ఎలా చూపించాలో కూడా రాసుకుంటే అదే స్క్రీన్‌ప్లే అవుతుంది. ఒక మంచి కథారచయిత సినిమా చిత్రీకరణకు సంబంధించిన సాంకేతికాంశాలజోలికి పోకుండా స్క్రిప్టు రాసివ్వడం తేలిక. అసలు తాను కథ రాసేటప్పుడే ఆయా సన్నివేశాల్ని తన మనోయవనికపై సాక్షాత్కరింపజేసుకునే రచనలు చేస్తారు ఏ రచయితైనా. అందుకే స్క్రిప్టు రాసివ్వడం వారికి నల్లేరు మీద బండి నడక లాంటిది. అయితే స్క్రీన్‌ప్లేలో అనేక సాంకేతికాంశాలు చోటు చేసుకుంటాయి. ఇవి రచయితకు సంబంధం లేనివి. స్థూలంగా చెప్పలంటే దృశ్యవిభజన వరకు స్క్రిప్ట్ రచయిత చేతిలో ఉంటే షాట్ విభజన స్క్రీన్‌ప్లే రచయిత చేతిలో ఉంటుంది. సాధారణంగా చిత్రదర్శకుడే స్క్రీన్‌ప్లే నిర్ణయిస్తారు. సంభాషణ, లేక స్క్రిప్టు రచయిత పాత్రల అభినయానికి సంబంధించి, ఆహార్యానికి సంబంధించి కొన్ని సూచనలు రాస్తాడు. అంతేకాక కథాచర్చలప్పుడు లభించని కొన్ని పాత్రౌచిత్యాలు, సంభాషణ రచనతో పూర్తవుతాయి. పాత్రల కదలికలు, హావభావాలు కూడా స్క్రిప్టులోనే వస్తాయి. మాటల రచన పూర్తయేసరికి కథా దృక్కోణంతోబాటు సినిమాలో ఎన్ని దృశ్యాలుండేదీ, వాటి ఉద్దేశ్యాలేమిటైందీ, కథావాతావరణం ఎలాంటిదనే విషయాలు కూడా తెలుస్తాయి. స్క్రీన్‌ప్లే: మాటల రచయిత పని పూర్తై స్క్రిప్టు చేతికందాక దాన్ని వెండితెరమీద ఎలా చూపించాలనేది దర్శకుడి పని. అప్పుడే స్క్రీన్‌ప్లే ఖరారవుతుంది. ఉదాహరణకు రచయిత సూర్యోదయమవుతోంది అని రాశాడనుకోండి. దర్శకుడు ఆ సూర్యోదయానికి తన చిత్రంలో, ఆ సన్నివేశంలో, ఆ దృశ్యంలో ఎంత ప్రాధాన్యత ఉందో అన్ని షాట్లు తీస్తాడు. ఆ దృశ్యంలో ఎన్ని షాట్లు తియ్యాలి, అందులో క్లోజప్పులు ఎన్ని, మిడ్ షాట్లు ఎన్ని, లాంగ్ షాట్లు ఎన్ని, సంభాషణ నడిచేటప్పుడు ఏదైనా పాత్ర మీద క్లోజప్ తియ్యాలా మిడ్‌షాటా, లాంగ్ షాటా… ఇవన్నీ నిర్ణయించడం దర్శకుడి పనే. ఇతివృత్తం -> కథాంశం -> సింగిల్ లైన్ స్టోరీ -> సీనిక్ ఆర్డర్ -> స్క్రీన్ ప్లే సినిమా తీయాలంటే ముందు కథ కావాలి. ఏ కథ ఎంతబాగా ఆడుతుందనే విషయంలో ఎవరి అంచనాలు వాళ్ళకుంటాయి. (”Last of the great Vijaya classics” గా గుర్తింపు పొందిన గుండమ్మ కథ ఎలా ఆడుతోందో, అసలు ఆ సినిమాలో ఏముందని జనాలు అంతగా చూస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అదే విజయావారికి మాయాబజార్, పాతాళభైరవి సినిమాలు తీసిపెట్టిన దర్శకుడు కె.వి.రెడ్డి అనేవారు.) రెడీమేడ్ కథను సినిమాకు adapt చేసుకుంటే (adopt చేసుకోవడం పాత సినిమాలను మళ్ళీ తీస్తున్నప్పుడు తప్ప సాధారణంగా జరగదు కాబట్టి) కథాచర్చలు సీనిక్ ఆర్డర్ నుంచి మొదలౌతాయి. అలా కాక కొత్త కథాంశాన్ని సినిమాగా తీయదలచుకున్నప్పుడు కథ యొక్క కథ ఇతివృత్తం నుంచి మొదలౌతుంది. సినిమా రచయిత కథ చెప్పడానికొచ్చినప్పుడు ముందుగా దర్శక, నిర్మాతలు ఒక్క ముక్కలో ‘కథేంటి?’ అని అడగడం పరిపాటి. కథారచయిత కూడా కాలహరణం చేయకుండా దానికి సమాధానం నాలుగు ముక్కల్లో చెప్తే దాన్ని బట్టి ఆ కథ తమ అభిరుచికి తగిందో కాదో, ప్రేక్షకులను ఆకట్టుకోగలదో లేదో, ఆ కథను సినిమాగా తియ్యొచ్చోలేదో వారికి ఒక అంచనా ఏర్పడుతుంది. ఉదాహరణకు “లంచగొండి అధికారులను ఒక్కొక్కరినీ హీరో చంపుకుంటూ పోవడమే” భారతీయుడు, ఠాగూర్, అపరిచితుడు - ఈ మూడు సినిమాల ఇతివృత్తం. అంటే మూడు సినిమాల ఇతివృత్తం ఒకటే! కానీ కథాంశాలు మాత్రం వేర్వేరు. (ఈ మూడు సినిమాల్లోని హీరోల్లో ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన నేపథ్యం. అందుకే అవినీతిపరులను చంపడానికి వారెంచుకున్న మార్గాలు విభిన్నమైనవి. ఆ మార్గాలే ఆయా కథాంశాల్లో వైవిధ్యాన్ని తీసుకొచ్చి ఘనవిజయాలు సాధించాయి.) స్వాతంత్ర్య సమరంలో INA తరపున బ్రిటిష్ వారితో పోరాడిన సైనికుడు స్వాతంత్ర్యానంతర భారతదేశంలో వేళ్ళూనుకునిపోయిన అవినీతిపై సాగించిన పోరాటమే భారతీయుడు కథాంశం. సంఘంలోని అవినీతిని సహించలేని, నేరుగా ఎదుర్కొనే ధైర్యమూ లేని సంప్రదాయకుటుంబానికి చెందిన బ్రాహ్మణయువకుడిలో ఉండే ఎవరికీ తెలియని మరో మనిషి split personality ద్వారా బయటికొచ్చి ఆ అవినీతిపరులను ఎలా ఎదుర్కొంటాడో, వారిని ఎలా శిక్షిస్తాడో మనస్తత్వశాస్త్రపరంగా చూపించడమే అపరిచితుడు కథాంశం. ఇలా మొదటగా నాలుగు ముక్కల్లో రాసుకునే కథనే సింగిల్ లైన్ స్టోరీ అంటారు. తర్వాత తీయబోయే పధ్నాలుగు రీళ్ళ సినిమాకు మార్గదర్శిగా ఉండేది ఈ నాలుగు ముక్కల సింగిల్ లైన్ స్టోరీయే. తర్వాతి దశలో ఈ నాలుగు ముక్కల కథను నాలుగు పేజీల కథగా రాసుకుంటారు. నాలుగు ముక్కల్లోకి రాలేని ఉత్కంఠ, నాటకీయతలు నాలుగు పేజీల కథలోకి వస్తాయి. కథలోకి కదలిక వస్తుంది. ఒక సన్నివేశం తర్వాత ఇంకొక సన్నివేశం వచ్చినప్పుడు కథ ఎలా ముందుకు కదులుతోందో స్పష్టంగా తెలుస్తుంది. ఈ సన్నివేశాల కూర్పు కథాంశానికి అనుగుణంగా ఉందో లేదో సరిచూసుకోవడానికి అవకాశముంటుంది. ఒకరకంగా చెప్పాలంటే మొత్తం పద్దెనిమిది రీళ్ళ సినిమాగా తీయబోయే కథకు ఇది సంక్షిప్తరూపం (precis writing లాంటిది). ఇదే శీర్షికలో ఇంతకు ముందు చెప్పినట్లు సినీరచయిత తనకు నచ్చినట్లు రాయడం కాకుండా నిర్మాత, దర్శకుడు, హీరో, తదితరుల ఇష్టాలను కూడా పరిగణనలోకి తీసుకుని కథలో అందుకు అనుగుణంగా మార్పులు చెయ్యవలసి ఉంటుంది. ఆ మార్పులు ఇక్కడినుంచే మొదలౌతాయి. అంటే ఇతివృత్తం రచయిత చెప్పిందే అయినా కథాంశం మాత్రం అచ్చంగా రచయిత ముందనుకున్నదే కాకపోవచ్చు. ఇతరుల ఇష్టాయిష్టాలే కాకుండా అర్థం పర్థంలేని సెంటిమెంట్లు, నటీనటుల ఇమేజ్ లాంటివాటికి అనుగుణంగా కథ మార్చి రాయాల్సి రావడం రచయిత స్వేచ్ఛను హరించడమే. సీనిక్ ఆర్డర్: సన్నివేశాల సమాహారం (దృశ్యమాలిక). కథారచనలో ఇది తర్వాతిదశ. కథాంశాన్ని తెరకెక్కించడానికి వీలుగా దృశ్యాలుగా విడగొట్టుకుని వరసగా రాసుకోవడమన్నమాట. దీంట్లో ప్రతి దృశ్యానికీ కథాంశపరంగా ఒక ప్రయోజనముండేలా, ప్రతి సన్నివేశం రసానుభూతికి భంగం కలగకుండా కథాంశాన్ని ముందుకు నడిపేలా జాగ్రత్త తీసుకోకపోతే కథనం పేలవంగా తయారవుతుంది. మాటలు: సీనిక్ ఆర్డర్ సిద్ధమైన తర్వాత మాటల రచయిత రంగప్రవేశం చేస్తాడు. స్క్రిప్ట్/స్క్రీన్ ప్లే రచన: సినిమా దృశ్యమాధ్యమం. సినిమా రచన కూడా దానికి తగినట్లే ఉండాలి. నేపథ్య, వాతావరణ చిత్రణలు దృశ్యంలోనో, శ్రవణంలోనో తెలియాలి. తాము ఆ సన్నివేశం జరుగుతున్నచోటే ఉన్న భావన ప్రేక్షకులకు కలిగించాలి. ప్రేక్షకులకు తాము సినిమా థియేటర్లో కూర్చుని సినిమా చూస్తున్నామనే ఆలోచన రానివ్వకుండా వారిని తనలో లీనం చేసుకుని తనతోబాటు ఆ వాతావరణంలో విహరింపజేసేదే నిజమైన సినిమా. దీనికోసం సందర్భానికి తగిన ధ్వనులు (సంవాదం, నేపథ్యసంగీతం, సంగీతం, వాతావరణ సంబంధ ధ్వనులు, జంతువులధ్వనులు) వినిపించడం, దృశ్యాలు చూపించడం చేస్తారు. లేకపోతే ప్రేక్షకులకు ఆసక్తి పోతుంది. ఇవన్నీ స్క్రీన్ ప్లేలో “లెఫ్టు”లో వస్తే మాటలు “రైట్” లో వస్తాయి. అందుకే కె. విశ్వనాథ్ లాంటి దర్శకులు లెఫ్టు నింపడం పై ప్రత్యేకశ్రద్ధ వహిస్తారు. స్క్రీన్ప్లే తయారుచేసేటప్పుడు ఆయన తన సహాయకులకు ఎప్పుడూ “లెఫ్టు నింపండిరా” అని బోధిస్తూ ఉంటారని ఆయన దగ్గర పనిచేసినవాళ్ళు చెప్తారు. ఇంతకూ ఈ “లెఫ్ట్” ఏమిటి? లెఫ్ట్ ఏమిటో తెలియాలంటే అసలు స్క్రీన్ ప్లే ఎలా రాస్తారో తెలియాలి. స్క్రీన్ ప్లే రాయడం కోసం పేజీలో మార్జిన్ వదిలిన తర్వాత మిగిలిన భాగాన్ని నిలువుగా మధ్యలోకి విభజించుకుంటారు. దాంట్లో ఎడమవైపు దృశ్యవివరణ, కుడివైపు సంభాషణలు రాసుకుంటూ పోతారు. పేజీ పై భాగంలో ఎడమవైపు సీన్ నంబరు, మధ్యలో లొకేషను, కుడివైపు ఇండోరా/ఔట్డోరా, పగలా/రాత్రా, అవసరమైతే టైమ్ రాసుకుంటారు. స్క్రీన్ ప్లేలో - మరీ ముఖ్యంగా ఎడమవైపు - ఎంత వివరంగా రాసుకుంటే చిత్రీకరణలో అంత స్పష్టత వస్తుంది. ఆ రకంగా చూస్తే మంచి మంచి దృశ్యకావ్యాల్లాంటి సినిమాలు తీసేవాళ్ళంతా ఎర్రకామెర్లు లేని లెఫ్టిస్టులే! శంకరాభరణం సినిమా మొత్తం కలిపినా సంభాషణలు పదహైదు పేజీలకు మించి లేవు! సినిమాస్క్రిప్టులో లెఫ్టు ప్రాధాన్యతేమిటో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ఐతే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి మాటల మాంత్రికులు లెఫ్టుకు ఎక్కువ మొగ్గకుండానే “రైట్ రైట్” అంటూ దూసుకుపోగలరు. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎవరి స్టైల్ వారిదే! కమల్ హాసన్ సినిమా ద్రోహి స్క్రిప్టులోని ఒక పేజీ: దృశ్యం:4 ఆది బెడ్‌రూమ్ లోపల/పగలు లాంగ్ షాట్ లో చెట్టు. కెమేరా కిందకు దించి ఆదినారాయణరావు ఇల్లు చూపిస్తారు. మిడ్ షాట్ లో సుమిత్ర బాత్రూమ్ తలుపులు తీసుకొని వస్తున్న దృశ్యం. మిడ్ షాట్ లో ఆదినారాయణరావు దుస్తులు ధరిస్తున్న దృశ్యం. లాంగ్-మిడ్ షాట్ లో ఇద్దరినీ చూపిస్తారు. సుమిత్ర: ఆది: సుమిత్ర: ఆది: సుమిత్ర: ఆది సుమిత్ర: ఇదేమిటి? ఆ(…అబ్బాస్ ఇంటికి. యూనిఫారమ్‌లోనా? ఆ(…కాస్త పని ఉంది. ఇవేం చెయ్యను? నమిలి మింగెయ్యనా? ఏదీ… ఏవిటది? ప్రభాత్ థియేటర్. ఈవినింగ్ సిక్స్ థర్టీ షో - రుపీస్ నైన్ ఫిఫ్టీ - నాట్ రిఫండబుల్ - మర్చిపోయానని చెప్తే మాత్రం నాకు కోపం వస్తుంది. క్లోజప్ షాట్ లో సుమిత్ర ఆదినారాయణరావు దగ్గరకు వచ్చే దృశ్యం. ఆది: సుమిత్ర: గుర్తుందని అబద్ధం ఆడితే? ఇంకా కోపం వస్తుంది మిడ్ షాట్ లో ఆమె నుంచి అతడు దూరంగా కదిలే దృశ్యం సుమిత్ర: అయితే, అది……మీకొద్దన్నమాట. మిడ్ షాట్ లో ఆది వెనక్కు తిరగడం. ఆది: సుమిత్ర: ఏది? ఇంకో పాపో! బాబో! ఇలా లాంగ్ షాట్లు, మిడ్ షాట్లు, క్లోజ్ షాట్లు మార్చి మార్చి చూపించడమెందుకు? ఇదే దృశ్యాన్ని ఆది, సుమిత్ర ఎక్కడివాళ్ళక్కడే బిగుసుకుపోయి డైలాగులు అప్పజెప్తూ ఉంటే, కెమెరాను కూడా ఒకేచోట పాతేసి, యాంగిల్ కూడా మార్చకుండా తీస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఇక నుంచి మీరు సినిమా చూసేటప్పుడు షాట్ మారడాన్ని అప్రయత్నంగానే గమనిస్తారు. ఆ విషయం నాకు తెలుసు. :) స్క్రీన్ ప్లేలో కుడి ఎడమల కనిపించే ఖాళీలు సెట్ ప్రాపర్టీస్, ఆ షాట్లో వచ్చే నటీనటుల వివరాలు, షూటింగులో ఓకే అయిన షాట్ నంబరు తదితరాలు రాసుకోవడానికి ఉపయోగపడతాయి.

ఓ నిముషము....

ఓ నిముషము నిర్లక్ష్యము ఖరీదు........? ఓ నిముషము నిర్లక్ష్యము ఖరీదు........? జూలియస్ సీజర్ అనే పరాక్రమశాలి 800 పట్టణములను జయించి, ఒక మిలియన్ మంది శత్రువులను చంపి వారి రక్తములో తన వస్త్రాలను ఉతుక్కొన్నాడు.అయితే తన విజయోత్సవ ఉచ్చ స్తితిలో నిందినవాడై, తనకు అందించబడిన ముఖ్యమైన సమాచారమును చదువుటకు సమయమివ్వలేక పోయడు. రోమా పార్లమెంటుకు భవనానికి వెల్లుతున్న అతనికి పార్లమెంటు మెట్ల దగ్గర ఓ శత్రువు అతనిని చంపుటకు పొంచియున్నాడు అన్న సమాచారమును ఓ సైనికుడు అందించాడు. అయితే సభకు ఆలస్యం అవుతుందనుకున్న సీజర్ ఆవుత్తరమును చదువుటకు సమ్యమివ్వలేక పోయెను.ఆ వుత్తరమును బెల్టుకింద పెట్టుకొని వెల్లాడు. ఆ వుత్తరం తన ప్రాణమును కాపాడుతుందనుకొలేదు. యధావిధిగా వచ్చిన సీజర్ను శత్రువు మెట్లదగ్గర కత్తితో పొడిచి చంపాడు. చుశారా! ఒక్క నిమిశము సమయము వెచ్చించి ఆ వుత్తరమును చదివి వుండి వుంతె అతను తన ప్రాణమును కాపాడుకొనె వాడు. ఈనాడు అనేకులు సమయం లేదంటు నిర్లక్ష్యముగా వుంటున్నారు.